మానవత్వం! - - బోగా పురుషోత్తం

Maanavatwam


ఓ అడవిలో నాల్గు సింహాలు వుండేవి. వాటి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నువ్వానేనా...రాజు?’ అంటూ పోట్లాడుకునేవి. నాల్గు సింహాలు ఒకే తల్లి బిడ్డలు కావడం , మగ సింహాలు కావడంతో రాజ్యాధిపత్యం కోసం కలహాలు కొని తెచ్చుకునేవి.
ఓ రోజు అన్ని సింహాలు కొట్లాడుకున్నాయి. వయసులో పెద్ద సింహం తలకి పెద్ద గాయం తగిలి రక్తం పోయి స్పృహ కోల్పోయింది. అది చూసి వాటి తల్లి తల్లడిల్లింది. వైద్యం కోసం ఆ అడవంతా కాళ్లరిగేలా తిరిగింది. అప్పటికే రాత్రి పడిరది. చీకట్లో కళ్లు కనిపించకపోవడంతో ఓ గుహలో పడుకుంది. అక్కడ దానికి ఓ వింత దృశ్యం కనిపించింది. దూరంగా కొండ కింది భాగంలో ఓ నలుగురు వ్యక్తులు దివిటీల వెలుగులో ఏదో గుసగుసలాడుకోవడం కనిపించింది. ఆసక్తిగా దగ్గరకెళ్లి చూసింది.
వారి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు వున్నాయి. వాళ్ల తండ్రిని విషపు గుళికలతో చంపి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ముగ్గురు కుమారుల్లో వైద్యుడైన ఒకడు సలహా ఇస్తున్నాడు. మిగిలిన అన్నదమ్ములు అంగీకరించారు. పథకం అమలుకు వ్యూహ రచన చేస్తున్నారు. అది విన్న సింహం కోపంతో గర్జించింది. ఆ అరుపు విన్న ముగ్గురు అన్నదమ్ములు తమ మందుల సంచిని పడేసి చీకట్లోకి పారిపోయారు.
తెల్లారిన తర్వాత సింహం ఆ సంచిని తీసుకెళ్లింది. తన పెద్ద పుత్రుడైన సింహం దగ్గరకు వెళ్లింది. సంచి తెరిచి చూసింది. అందులో ఓ హానికరమైన గుళికలు వున్నాయి. ఆ మనుషుల మాటలు గుర్తుకువచ్చి గుళికలను దూరంగా విసిరి వేసింది. మరో చిన్న పెట్టెలో ఎర్రని చూర్ణం లాంటి మందు వుంది. దాన్ని మొదట నోట్లో వేసుకుని పరీక్షించింది. ఎలాంటి ముప్పు లేదని గ్రహించి స్పృహ తప్పి పడివున్న తన పుత్ర సింహం నోట్లో వేసింది.
గంట తర్వాత అది పైకి లేచి కూర్చుంది. ఎదురుగా వున్న తల్లిని చూసి సోదరు నుంచి రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది.
తల్లి సింహం తన బిడ్డల కలహాలు చూసి కంట తడి పెట్టుకుంది. తను గుహలో విన్న మనుషుల మాటల్ని వినిపించింది. అవి మనుషుల వద్దకు తీసుకెళ్లాలని పట్టుబట్టాయి. తల్లి సింహం బిడ్డల్ని ఆ పక్కనే వున్న ఊరికి తీసుకెళ్లింది. మనుషులకు కనిపించకుండా పొదల మాటున దాక్కుని వినసాగాయి.
ఎదురుగా వున్న ఇంట్లో ఆస్తికోసం కొడుకుల విష ప్రయోగంతో చనిపోయిన భర్త ముందు రోదిస్తోంది తల్లి. ఆస్తి కోసం కన్న తల్లి పేగుబంధం తెంచి దు:ఖ బంధం మిగిల్చిన ఆ కొడుకుల్ని చూసి సింహాలు కళ్లు తెరిచాయి. ఆస్తి కోసం కన్న తండ్రినే పంపారు మనుషులు.. వారి కన్నా మనమే నయం.. మానవత్వం మరిచి ప్రవర్తిస్తే మిగిలేది దు:ఖమే అని గ్రహించాలి.. మానవత్వం మరిచిన మనుషుల్లా కక్షలు, కార్పణ్యాలతో తగువులాడితే మానసిక క్షోభ మాత్రమే మిగులుతుంది అని గ్రహించాయి. అప్పటి నుంచి మనుషులకు కనువిప్పు కలిగేలా అన్నదమ్ములైన సింహాల మధ్య రాజ్యాధిపత్యపోరు వీడి వయసులో పెద్దదైన పెద్ద సింహానికి రాజ్యాధిపత్యం అప్పగించి కలహాలు మాని ఐకమత్యంతో మెలుగుతూ హాయిగా జీవించసాగాయి.

మరిన్ని కథలు

Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్
Jeevinchu
జీవించు
- B.Rajyalakshmi