మాటకలుపు! - టి. వి. యెల్. గాయత్రి.

Maata kalupu

"సుధాకర్!నీతో ఒక విషయం చెప్పాలి!"అన్నాడు శ్రీనివాస్. "చెప్పరా!" "మా బావగారు ఛిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నారు. నేను ఆయనకు మద్దతుగా ఒక పదిలక్షలు పెడుతున్నాను. నువ్వు కూడా మా బావగారికి సపోర్ట్ గా కొంచెం మనీ పెట్టరాదూ!" "అలాగే!అలాగే!ఎంత పంపించనూ?.." "ఒక ఫైవ్ ఉంటే పంపించు!" "సరే!సరే!నువ్వు చెప్పాక కాదంటనా?...." నవ్వుతూ ఫోన్ పెట్టాడు సుధాకర్. సుధాకర్, శ్రీనివాసులు ఇరవై ఏళ్లుగా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్ లో డబ్బు లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవటాలు సర్వసాధారణం. కొన్ని నెలలు గడిచాయి. ఎవరో ఫ్రెండ్స్ ద్వారా శ్రీనివాస్ బావగారి ఛిట్ ఫండ్ కంపెనీ మూతపడిందనీ, ఖాతాదారులు ఆఫీసును చుట్టుముట్టారని సుధాకర్ కు తెలిసింది. వెంటనే శ్రీనివాస్ కు ఫోన్ చేశాడు. రెస్పాన్స్ లేదు. ఖాతాదారుల వత్తిడికి ఫోన్ స్విచ్ డాఫ్ లో పెట్టాడు శ్రీనివాస్. 'సరేలే!టెన్షన్ లో ఉండి ఉంటాడు. తర్వాత కనుక్కుందాం!'అనుకొని ఊరుకున్నాడు సుధాకర్. ఖాతాదారులకు తన ఆస్తిని కూడా కొంత అమ్మి కట్టాల్సివచ్చింది శ్రీనివాసుకు. అప్పుడే ఒక కొత్త కాంట్రాక్ట్ రావటం వలన రాజస్తాన్ వెళ్ళాడు సుధాకర్.ఒక పదిహేనురోజులు స్నేహితుడితో మాట్లాడలేకపోయాడు సుధాకర్. బావగారిని రక్షించే పనిలో ఉన్నాడు శ్రీనివాస్. 'తాను ఆస్తులు అమ్ముకునే స్థితికి వస్తే సుధాకర్ కనీసం పలకరించటానికైనా రాలేదని' మనసులో బాధపడ్డాడు శ్రీనివాస్. ఊరినుండి వచ్చాడు సుధాకర్.శ్రీనివాస్ నుండి ఫోన్ లేదు. 'తనను అడిగిన వెంటనే కాదు అనకుండా వాళ్ళ బావగారికి ఐదులక్షలు పంపించాడు. అవి తిరిగి వచ్చే దిక్కులేదు. వాటి గురించి కాదు కానీ, ఇలా అయిందని శ్రీనివాస్ తనతో ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా!ఒక్క మాటయినా మాట్లాడలేదని 'తలపోశాడు సుధాకర్. మధ్యలో వీళ్లిద్దరి స్నేహం చూసి భరించలేని గుంటనక్కలు కొందరు సుధాకరుకు శ్రీనివాసు గురించి లేనిపోనివి చెప్పి కాస్త ఆజ్యం పోశారు.ఫలితం....సుధాకర్ మనసులో శ్రీనివాస్ మీద కొంచెం దురభిప్రాయం కలిగింది... ఇద్దరిమధ్యా అరలు, తెరలు ఏర్పడ్డాయి. దూరం పెరుగుతోంది!ఎవరి సమస్యల్లో వాళ్ళు చిక్కుకొని...కాలం గడుపుతున్నారు.. "ఏరా!సుధా!మన శీను కనిపించటం లేదీ మధ్య!.. ఏమిటి విషయం?"అంది తల్లి కళ్యాణి. ఆమె కొద్దిరోజుల క్రితమే తీర్థ యాత్రలు ముగించుకొని కొడుకు దగ్గరికి వచ్చింది. జరిగింది చెప్పొడు సుధాకర్. "అయ్యో రామా!వాడు కష్టంలో ఉండి ఉంటాడు.. సొంత బావగారి కంపెనీ గల్లంతు అయితే వాడికి మాత్రం దెబ్బ కాదూ!.. నువ్వు మరీ అతిగా ఆలోచించకు!వెళ్లి వాడితో మాట్లాడి కాస్త ధైర్యం చెప్పిరా! స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఎక్కువకాలం మాట పట్టింపులు ఉండకూడదు!.. కాస్త పట్టువిడుపూ అంటూ ఉండాలి!"అంటూ కొడుకును మందలించింది కల్యాణి. తల్లి మాటలతో కళ్ళు తెరుచుకున్నాయి సుధాకరుకు. "తనెంత చిన్న మనసుతో ఆలోచించాడు!కష్టం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు! దారిన పోయే పనికిమాలిన వాళ్ల మాటలు విని, శీను లాంటి మంచి స్నేహితుడిని వదిలేసాడు .. పెద్ద పొరబాటు చేశాడు ' అనుకుంటూ శ్రీనివాస్ ఇంటికి బయలుదేరాడు సుధాకర్. సమాప్తం.

మరిన్ని కథలు

Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి