ఏమి నీ కోరిక? - kottapalli udayabaabu

Emi nee korika


అడవికి సింహమైన రాజుకి, రాణి సింహానికి లేకలేక కొడుకు సింహం పిల్ల పుట్టింది.

రాణిసింహానికి తనలాంటి ఆడసింహపు పిల్లలు అంటే చాలా ఇష్టం. దానిని ఎంతో ప్రేమగా సాకేది. దాంతో పుట్టిన మగ సింహపు పిల్ల తోక ఎదుగుతున్న కొద్దీ చక్కగా జడలు వేసి,వాటిలో కూడా అడివిపూలు పెట్టి మురిసిపోయేది.

తనని అనుసరిస్తూ తన బిడ్డ తనలాగే వయ్యారంగా నడవడం చూసి ముచ్చట పడిపోయేది. రంగురంగుల బట్టలు తొడిగి సంబరపడిపోయేది.

లేక లేక కలిగిన బిడ్డ కావడంతోను, భార్య మాటకు ఎదురు చెప్పలేక మృగరాజు కూడా తన బిడ్డను అలా చూసుకుని మురిసిపోయేవాడు.

ఎదుగుతున్న కొద్దీ యువ మృగరాజులో ఆడ లక్షణాలు, స్త్రీ సహజమైన సిగ్గు, బిడియం, నడకలో ఒయ్యారం అన్ని పెరిగిపోసాగాయి.అడవిలో మిగిలిన జంతువుల పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళినపుడు యువమృగరాజును రాజు కొడుకు అని కూడా చూడకుండా ఏడిపించేవారు. అది భరించలేని రాణి ఒకసారి ఆ ఏడిపించిన జంతువులని హెచ్చరించేది. రెండవసారి కూడా ఏడి యువమృగరాజు తండ్రితో చెప్పి ఏడిచేవాడు.

ఎదుగుతున్న బిడ్డకు వేటాడటం నేర్పాలని ప్రయత్నించిన రాజు ఆశ ఆడియాసే అయ్యింది.

"నా బిడ్డని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. నేను బ్రతికిఉండగా వాడికి అన్నపానీయాలకు లోటు రానివ్వను"అని మృగరాజు నోరు మూయించేసింది రాణిమృగరాజు.

ఏ విద్య రాక, నలుగురిలోను కలిసే గుణం నేర్చుకోక యువరాజు ఆకారానికి బాగానే ఉన్నా ఎందుకూ పనికిరాని బుద్ధిహీనుడులా తయారయ్యాడు. ఆ మనోవేదనతో మృగరాజు మరణించాడు.

రాజు ఉన్నంతవరకు వేటాడి తెచ్చిన ఆహారంతో ఇంతకాలం సుఖంగా బ్రతికారు తాను, తన బిడ్డ.కానీ తన ముచ్చట తీర్చుకోవడం కోసం తానే తన కొడుకుని తనశక్తి మీద తనకే నమ్మకం లేకుండా పెంచి తానెంతో తప్పు చేసింది అని బాధ పడి తన బాధను మంత్రి నక్కబావతో వెళ్లబోసుకుంది.

''అమ్మా. జరిగినదానికి బాధపడి లాభం లేదు. మీ అబ్బాయిని మన సేనాధిపతి చిరుతపులి గారితో వేటకు పంపండి. ఆయనని వేటాడటంలో గల మెలకువలన్నీ అబ్బాయిగారికి నేర్పమని ఆదేశించండి. అబ్బాయిగారికి ఆత్మవిశ్వాసం కలిగే పనులు మీరు నేర్పండి. తనపనులన్నీ తానే చేసుకోవడం, ఇతరులమీద ఆధారపడకుండా చురుకుగా ఆలోచించడం, స్వంతనిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలలో తర్ఫీదు ఇవ్వండి. అబ్బాయిలో తప్పక మార్పు వస్తుంది."

" నువ్వు మంత్రి వేగా..ముందు అబ్బాయిని వేటకు తీసుకెళ్లి చిన్న చిన్న జంతువుల్ని ఎలా వేటాడాలో ముందు వాడికి నేర్పించు. అది నీ వల్ల కాకపోతే అప్పుడు సేనాపతితో మాట్లాడుతాను. "అంది రాణి సింహం. ఇక తప్పదని ఓ మంచి శుభ ముహూర్తం చూసి కొడుకు సింహంతో వేటగా బయలుదేరింది మంత్రి నక్క.

కొద్ది దూరంలో ఒక కుందేలు చూపించి "హఠాత్తుగా దాని మీదకు దూకి దాని మెడ కొరికి చంపండి యువ రాజా!" అని చెప్పింది నక్క.
యువరాజ్ సింహం అలాగే చేయడానికి ముందుకు దూకింది. కానీ కుందేలు ఒక్క క్షణంలో ప్రాణ భయంతో ముందుకు ఉరికేసింది.
అలా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసిన యువరాజు సింహానికి కుందేలు దొరకలేదు. అంతలో అక్కడికి కుందేలు తల్లి వచ్చి యువరాజు సింహాన్ని చూసి పకపక నవ్వుతూ
"ఓ. యువరాజు సింహం గారు వేటకి మొదటిసారి వచ్చినట్టు ఉన్నారే. " అని వెక్కిరించి.. తన బిడ్డతో " నేను పక్కన లేకుండా ఎప్పుడూ నిన్ను బయటకు రావద్దన్నానా!ఆయనకు వేట రాదు కాబట్టి నువ్వు బతికి పోయావు. పద పద!" అని బిడ్డతో చెంగుచెంగున దూకి పొదల్లోకి పారిపోయింది.
యువరాజ్ సింహానికి ఎంత అవమానం అనిపించింది.
" మంత్రి ఈ వేట అది నా వల్ల కాదు. నువ్వే ఏవైనా చిన్న చిన్న వాటిని చంపి తీసుకురా. అవి తీసుకుని వెళ్లి నేనే వేటాడాలని అమ్మకి చెబుతాను!" అంది.
ఇదేదో తన చావుకి వచ్చింది అనుకున్న మంత్రి నక్క " సరే మహారాజా." అని ఒక జింక కూనని వేటాడి " పదండి మహారాజా. రాణి గారికి చూపిద్దాం" అని రాణి సింహం దగ్గరికి వెళ్లి యువరాజ్ ఎంతో వీరోచితంగా జింకల గుంపును పరిగెత్తించి జింక కూనను వేటాడినట్టు వర్ణిస్తూ చెప్పింది.
యువరాణి సింహం పకపక నవ్వింది.
" మొదటి రోజే నా కొడుకు మహా వీరుడిలా వేటాడన్నమాట. అలా నువ్వు చెబితే నమ్మేస్తాను అనుకున్నావా. నా బిడ్డ జింక కూన మెడ కొరికితే వాడి నోటికి రక్తం అంటుకుని ఉండాలి కదా. నిజం చెప్పు. నిన్ను ఇప్పుడే సేనాపతికి అప్పగిస్తాను" అంది కోపంగా

యువరాజ్ సింహమే అలా చేయమన్నాడని చెబితే యువరాణి సింహం తన మీద మరింత కోప్పడుతుందని ఆలోచించిన నక్క మంత్రి "క్షమించండి మహారాణి. రేపటి నుంచి అలా జరగదు. ఈ ఒక్క తప్పు మన్నించండి."అంది.

తర్వాత మహారాణి సింహం తన కొడుకు సింహంతో "అయినా అబ్బాయి. ఈ రాజ్యానికి నువ్వు యువరాజువి. నా ముచ్చట తీర్చుకోవడం కోసం తెలుసో తెలియకో నేను తప్పు చేశాను. రేపటి నుంచి నువ్వు వేటకి వెళ్ళినప్పుడు మిగతా మగ జంతువులన్నీవిధంగా వేటాడుతున్నాయో గమనించు. ఆ తర్వాత నువ్వు కూడా వేటాడే ప్రయత్నం చెయ్యి. లేకపోతే నీకుఅడవికి రాజుగా ఉండే యోగం ఉండదు. " అని నచ్చ చెప్పింది.
నక్క మంత్రి వెళ్ళిపోయాక సేనాపతి చిరుతపులిని పిలిపించి యిలా అంది.
" సేనాపతి. నేను యువరాజు విషయంలో తెలియకుండా తప్పు చేశాను. నా కుమారుడికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు? " అని అడిగింది.
" మహారాణివిధంగా మీముందు మాట్లాడుతున్నందుకు సాహసిస్తున్న నన్ను మన్నించండి. యువరాజు గారికి ఆడ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి అబ్బాయిని అల్లుడుగారు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. " అంది సేనాపతి చిరుత పులి.
" చూడు సేనాపతి. వాడు పుట్టుకతో మగవాడు. నేను చేసిన తప్పు వల్ల వాడికి తాత్కాలికంగా కొన్ని అలవాట్లు వచ్చాయి.
వాటిని తగ్గించుకుని మగవాడిలా ప్రవర్తించే విధంగా వాడిని మార్చే ప్రయత్నం నీ కుమార్తెను చేయమని చెప్పు.
ఈపెళ్ళివల్ల నీకు కలిగే లాభం ఏమిటి అంటావేమో. నీ కుమార్తెఅడవికి యువరాణి అవుతుంది. మనం వియ్యాలవారం అవుతాం. నీ కుమార్తెతో వివాహం చేయడం వల్ల నా కొడుక్కి బాధ్యత వస్తుంది. భార్యను పోషించుకోవడం భర్త ధర్మం. నీ కుమార్తెను వాడిలో పౌరుషం, ధైర్యం నింపే మాటలతో ప్రోత్సహించమని చెప్పు. తొందర్లోనే వాడు వేటాడటం నేర్చుకుని అడవికి అచ్చమైన యువరాజు అవుతాడు.
వివాహం అయ్యేలాగా వేటలో మెలికలన్నీ అతనికి నువ్వు కూడా నేర్పు. ఏమంటావు? " అంది మహారాణి సింహం.

"నా కుమార్తెనుఅడవికి మహారాణి అవుతుంటే నాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి మహారాణి. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను " అన్నాడు సేనాపతి చిరుత పులి.

మరునాటి నుంచే సేనాపతి చిరుతపులి పర్యవేక్షణలో కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న జంతువుల్ని వేటాడటం నేర్చుకున్నాడు యువరాజు సింహం.
వెంటనే యువరాజు సింహానికి సేనాపతి చిరుతపులి కుమార్తెతో వివాహం చేసి కొడుకు విషయంలో ఎలా ప్రవర్తించాలో కోడలికి చెప్పింది మహారాణి సింహం.

భార్య చిరుత పులి మాటలతో పౌరుషాన్ని ధైర్యాన్ని పెంచుకున్న యువరాజు సింహం తొలిసారిగా ఏనుగుని వేటాడి తన మగతనాన్ని నిరూపించుకుంది. అనతి కాలంలోనే తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంది.

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు