
తెలుగు గ్రామాల విశేషంలో, కొన్ని మాటలు తరతరాలుగా మారకుండా ఉండిపోతాయి. అలా మల్లంపాడులోనూ ఒక నమ్మకం రాజ్యమేలేది—“ఆడపిల్ల గుడిబండా!” అంటే, ఆమె ఏదైనా సాధించలేరు, ఇంట్లో కూర్చోవడం, పనులు చేయడమే ఆమె భవిష్యత్తు. కానీ ఆ మాటకు వ్యతిరేకంగా పోరాడిన కథ ఇది.
అనూష – ఓ ఆశకిరణం
మల్లంపాడు అనే ఊరిలో, పదమూడేళ్ల అనూష చదువులో మేటి. ఊరి ఏకైక ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతూ, తన కలలను పరిపూర్ణం చేసుకోవాలని తపిస్తూ ఉంటుంది.
అయితే ఊర్లో అందరికీ ఒకే మాట—“ఆడపిల్లకి చదువు ఎందుకు?”
అనూష స్కూల్ నుండి వస్తుండగా, ముగ్గురు అబ్బాయిలు—రాము, బాబు, మల్లీ, ఆమెను అడ్డగించారు.
“అరే అనూష! స్కూల్ నుంచి వస్తున్నావా? నీకు చదువు ఎందుకు? మగాళ్లతో పోటీ పడతావా?”
ఆ మాటలు విని అనూష కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇంటికి పరుగెత్తింది. లక్ష్మమ్మ (ఆమె తల్లి) ఆమెను అర్థం చేసుకొని, “కన్నీళ్లతో కాదు పాపా, విజయం సాధించి వాళ్లకు సమాధానం చెప్పాలి!” అని ధైర్యం చెప్పింది.
సుదర్శన్ మాస్టారు – మార్గనిర్దేశం
అనూష కష్టాన్ని గమనించిన వ్యక్తి సుదర్శన్ మాస్టారు. ఊరిలోని ఏకైక విద్యా గదిలో పిల్లలకు విద్య బోధిస్తూ, “చదువేభవిష్యత్తు!” అనే ఆశను నింపే గొప్ప గురువు.
ఒకరోజు స్కూల్లో అన్నీ బాగా చదివిన తర్వాత, మాస్టారు అనూషతో చెప్పారు—
“నీ చదువు మానేస్తే ఈ ఊరికి చాలా నష్టం. నువ్వు చదువుకుంటే ఇంకెంత మంది అమ్మాయిలకు ఆదర్శంగా మారవు. వెనక్కి తగ్గకు!”
అనూష మరింత పట్టుదలతో ముందుకెళ్లింది.
లక్ష్మమ్మ పోరాటం
అనూష చదువుతో పాటు లక్ష్మమ్మ జీవితం కూడా సులభం కాదు. ఆమె భర్తను చిన్నతనంలోనే కోల్పోయి, కూలిపని చేస్తూ కూతురిని పెంచుతోంది. ఒకరోజు, ఊరి పెద్ద శంకరయ్య ఆమెను పిలిచి,
“నీ కూతురిని చదివించడం మానిపించు. పెళ్లి చేయించు. మీరు సమాజానికి వ్యతిరేకంగా పోతే ఒప్పుకోలేం!”అని హెచ్చరించాడు.
కానీ లక్ష్మమ్మ వెనక్కి తగ్గలేదు. “ మా అమ్మాయి చదువుతుందన్నది నా తుది నిర్ణయం!” అని గట్టిగా చెప్పింది.
ఆ మాట విన్న ఊరంతా ఆశ్చర్యపోయింది.
లక్ష్మమ్మ ధైర్యానికి మూలం, ఆమె తల్లి వసంతమ్మ. ఆమె చిన్నతనంలోనే చదువు మానేసి పెళ్లయ్యింది. కానీ తన కుమార్తెకు చదువు అడ్డంకిగా మారకూడదని తపించింది.ఒక రోజు లక్ష్మమ్మకు చెప్పింది—
“నాకైతే అవకాశం రాలేదు, కనీసం నీకైనా, నీ పాపకైనా అది రావాలి. మనం వెనక్కి తగ్గితే, ఇంకెప్పటికీ ఆడపిల్లలువెనుకబడి ఉంటారు.”
ఈ మాటలు లక్ష్మమ్మలో మరింత బలాన్ని నింపాయి.
ఒకరోజు, ఊరి పెద్దలంతా కలిసి ఓ సభ ఏర్పాటు చేశారు.
శంకరయ్య సభలో, “ఈ ఊరిలో ఆడపిల్లలు చదువుకోవడం అవసరం లేదు! అందరూ ఇంట్లో ఉండాలి!” అని తేల్చిచెప్పాడు. అందరూ ఊహించినట్లుగానే, లక్ష్మమ్మ గట్టిగా ఎదురు నిలిచి, “నేను ఏం చేసినా నా పాపచదువుతుంది!” అని తేల్చి చెప్పింది. ఆ రోజు నుండి అనూష, ఊరి ప్రజల తిట్లను తట్టుకుంటూ, ఈసడింపులను భరిస్తూనే చదువును కొనసాగించింది.
ఏళ్ల పాటు కష్టపడిన అనూష, పట్టణానికి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి ఒక IAS అధికారి అయ్యింది. ఊరికి తిరిగి వచ్చేటప్పుడు ఊరి ప్రజలు ఆమెను గౌరవంగా స్వాగతించారు. అదే ఆ ఊరికే చెందిన రాము, బాబు, మల్లీ ఇప్పుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు.ఒక సభలో అనూష మాట్లాడింది—
“ప్రపంచం భావించేటట్లు ఆడపిల్ల ఎప్పటికీ గుడిబండ కాదు… గుడిలోని పునాదిరాయి! చదువుతో, సంకల్పంతో, మనప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు. నన్ను చదివించడానికి నా తల్లి ఎంతో కష్టపడింది. ఇప్పుడు మీరే చెప్పండి, చదువుకున్న అమ్మాయిని గౌరవంగా చూడాలా? లేక ఇంకా గుడిబండా అని తిట్టాలా? మీ ఇళ్లలో ఆడపిల్లలు చదువుకుని బాగుపడితే మీకు గర్వకారణం కాదా?? వాళ్ళు తెచ్చే పేరు మీకు కాదా?? వాళ్ల వల్ల వచ్చిన గౌరవం మీకు అక్కరలేదా?? ఏ శాస్త్రం ఆడపిల్ల తక్కువ అని చెప్పింది..!?? నన్నే చూడండి ఎందరో మగ పిల్లల కన్నా నేను ఇపుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరగగలను.. మా అమ్మను మహారాణిలా చూసుకోగలను.. ఇపుడు. చెప్పండి నేను చేసింది తప్పా??”
ఊరంతా మౌనంగా మారిపోయింది. సుదర్శన్ మాస్టారు ఒక్కసారి చప్పట్లుకొట్టారు. వెంటనే ఊరంతా మోగిపోయింది. ఆ రోజు నుండి, “ఆడపిల్ల గుడిబండా!” అనే మాట మల్లంపాడులో ఎప్పటికీ వినిపించలేదు.